24, ఆగస్టు 2012, శుక్రవారం

చీకటి రాజ్యం...

నాకు నా బాల్యం లో రోజులు ఈ మధ్య గుర్తుకు వస్తున్నాయి.  కిరోసిన్ దీపపు వెలుగులో చదువుకొంటున్న రోజులు... ఇంటి బయట వీధుల్లో మంచాలు వేసుకొని నిద్రించ డాలు.. రాత్రి తిండి పొట్టలో పడగానే ఇంటిల్లపాది ఒక చోట చేరి ఆడే అంత్యాక్షరీలు ... వీధుల్లో చీకటి సందుల్లో ఆడే దాగుడు మూతలు...  గతం గురించి ఆలోచించి నప్పుడు ఇవన్నీ తీపి గురుతులుగా అనిపించవచ్చు .... కానీ ఇప్పుడు అవే సంఘటనలు మళ్ళీ జరుగుతుంటే చేదు అనుభవాలుగా అనిపిస్తున్నాయి.  నిన్న మొన్నటి వరకూ వర్షాలు లేవని, తెలంగాణా బందు లనీ, తరువాత బొగ్గులు లేవనీ, ఇలా రోజుకో కారణంతో, మీడియా సహాయం తో అది నిజమే అని నిరూపిస్తూ, పగలూ, రాత్రి, ఎండా, వాన, తేడా లేకుండా, చిన్న, చితకా, ముసలీ, ముతకా, చస్తే మాకేం అంటూ, మీ చదువులు చట్టు బండలవు గాక అంటూ, ఇష్టం వచ్చిన టైం లో, ఇష్టం వచ్చిన న్ని గంటలు, యధేచ్చగా, నిస్సిగ్గుగా, నిర్మొహమాటంగా, నిరాటంకంగా, కరంట్ తీసేస్తూ, ఆంధ్ర ప్రదేశ్ ను అంధేరా ప్రదేశ్ గా మార్చేస్తున్న ఈ కోతలు ఎంతమందిని ఎన్ని విధాలుగా నష్టపరచినా తమకేమీ పట్టనట్టుగా ప్రవర్తిస్తున్నాయి విధ్యుత్ శాఖ వారూ, ప్రభుత్వం వారూను...  నా వయసు నలభై మూడు సంవత్సరాలు... కానీ ఇన్నేళ్ళ నా జీవితం లో, నాకు గుర్తున్నంత వరకూ, నిద్ర పోవడానికి ముందు ఎన్ని గంటలైనా కరంట్ తీసేవారు కానీ, నిద్రపోతున్న సమయంలో ఎప్పుడూ తీయలేదు...  ఇప్పుడు మాత్రం గాఢ నిద్రలో ఉన్నప్పుడు పీడ కల వచ్చి నట్లు హటాత్తుగా మెలకువ వస్తుంది..  చచ్చిన వాడిపై ఈగలు మూగి నట్లు, ఝుమ్ మంటూ, లయబద్ధంగా వినిపించే సంగీతమ్తో  మేలుకొలుపులు పాడుతూ దోమలు...  దూరంగా చిన్న పిల్లల ఏడుపులు... ఎక్కడ నుంచో ముసలి వాళ్ళ నిట్టూర్పులు..  నిద్ర మత్తులో ఏమైందో తెలియక అయోమయంగా అటూ, ఇటూ చూస్తాం.. అప్పటికి గానీ అర్థం కాదు... ఇవన్నీ కరంట్ పోవడం వాళ్ళ వచ్చిన సిమ్తం లని... పొద్దున్న లేవల్సిన టైం కి మెలకువ రాక, ఆఫీసు కి పోతే అందరి కళ్ళూ సిల్క్ స్మిత మత్తు కళ్ళలా కనిపిస్తున్నాయి... జనాలు ఏమైపోయినా ఈ దారిద్ర గొట్టు ప్రభుత్వానికి పట్టదు .... ఈ గొర్రె జనాలకూ అంతే... రూపాయికి కిలో బియ్యం ఇస్తే చాలు... మార్కెట్ లో కిలో బియ్యం నలభై రూపాయలైనా ఫరవాలేదు... ఉచితంగా విద్యుత్ ఇస్తామంటే చాలు... డబ్బు తీసుకునే పూర్తిగా ఇవ్వని వాడు... ఉచితంగా ఎలా ఇస్తాడనే ఆలోచనే లేదు... పూర్వం లా లాంతర్లు వాడదామంటే కిరోసిన్ దొరకదు... ఏదో పది రూపాయలకు దొరుకుతున్నట్లు ప్రతీ ఒక్కరూ inverter లు వాడేస్తూ బతికేస్తున్నారు... సరే... కరెంట్ ఉత్పత్తి లేదు.. కానీ ఒక పధ్ధతి ఉంటుంది కదా తీయడానికి..  నిద్ర పోతున్న సమయం లో తీయడం ఏమిటి... రాత్రి రెండు దాటాక... కొద్దిగా కూడా ఇంగిత జ్ఞానం ఉండగా వీరికి...
కరెంట్ తీయడానికి బాధ్యులెవరో కానీ... వారికి నా విన్నపం ఏమిటంటే...  పగలంతా 12 గంట లూ మీ ఇష్టం... పోనీ ఏ కొవ్వొత్తి వెలుగులో నో, పిల్లలు చదువుకొంటారు... రాత్రి నిద్రపోతున్న సమయం లో మాత్రం దయచేసి కరంట్ తీయకండి... ప్లీజ్... రాత్రి నిద్రపోయే ముసలాడు పొద్దున్న లేవాల్సిన సమయానికి లేవక పోతే ఉన్నాడో , పోయాడో అని అనుమానం...  పేర్లు లేని దోమలు, ఇష్టానుసారం కుట్టటం వల్ల , వచ్చే కొత్త కొత్త జబ్బులకు పేర్లు పట్టలేక సైంటిస్టులూ, వాటికి మందులు ఏమి ఇవ్వాలో తెలియక డాక్టర్లూ, చాల ఇబ్బంది పడుతున్నారు... పెరుగుతున్న ధరల వల్ల జీతాలు వారం రోజుల్లో ఖర్చు అయిపోతున్నాయి... మళ్ళీ ఈ జబ్బుల కయ్యే ఖర్చు కోసం అడ్వాన్సులూ , అప్పులూ, తీసుకోవాల్సి వస్తుంది... కాస్త ఆలోచించండి ప్లీజ్... 
అయినా నా పిచ్చి కానీ, కోడి బాధ గురించి ఆలోచిస్తే చికెన్ తినగలమా..  మేక బాధ గుర్తించ గలిగిన వాళ్ళమే అయితే మటన్ తినగలమా... వీళ్ళూ అంతే... మనం వీళ్ళకి చికెన్ లం, మటన్ లం.. అంతే కదా...
ప్చ్... మళ్ళీ కరంట్ పోయింది....
బై

14, ఆగస్టు 2012, మంగళవారం

స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు




స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
బ్లాగ్ మిత్రులందరికీ 65 వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు...

పరాయి దేశస్తుల పాలన నుండి విముక్తులమై 65 సంవత్సరాలు దాటిపోతున్న ఈ తరుణంలో మనం ఎక్కడున్నాం, మన ఆలోచనలు ఎక్కడున్నాయి, ఈ 65 సంవత్సరాలలో మనం ఏమి సాధించాం ... అని ప్రతీ సారి అనుకుంటూ ఉంటాం... స్పీచ్ లు వినేస్తం.. స్వీట్లు తినేసాక జైహింద్ అని మన రొటీన్ లో పడిపోతాం... స్వాతంత్రం రాకముందు మనపై ఒక్క బ్రిటిష్ వారి ప్రభావమే ఉండేది... కానీ ఇప్పుడు మన దేశ ప్రభావం తప్ప అన్ని దేశాల ప్రభావం మనపై ఉంది... ఇంతకాలమైన మనం వాడుతున్న ప్రతీ వస్తువు పై విదేశీ ముద్ర ఖచ్చితంగా ఉంది... మనం పెంచుకునే కుక్క విదేసీది... తోటలో గడ్డి విదేశీయుల దే.   మన మామిడి, అరటి, కొబ్బరి, తాటి చెట్ల కన్నా క్రోటన్ మొక్కలంటే మనకు ప్రీతీ.  "వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు" లని తీసిపారేసే మనం వాసన లేని గడ్డి పువ్వులను బోకేలంటూ వాడేస్తున్నాం.  వర్షాలు లేకపోతే వర్షాలు లేవో అని ఏడుస్తూ ఉంటాం.. గట్టిగా వర్షాలు పడితే నిలువ చేసుకొనే మార్గాలు లేక సముద్రానికి వదిలేస్తూ ఉంటాం..  నాలుగు రోజుల క్రితం ముప్పై ఐదు రూపాయలకి కొన్న పంచదార ఈ రోజు నలభై దాటిందంటే... మన ఖర్మ అని adjust అయి పోతాం... మనం డాక్టర్ చదువులకు కూడా పెట్టని డబ్బు మన పిల్లలకు ఎల్. కే. జి. కి సునాయాసంగా ఖర్చు పెట్టేస్తూ ఏమి చేస్తాం అనుకుంటూ గడిపేస్తాం... చూస్తుంటే మనకు కావలసింది స్వేచ్చ కాదు... క్రమశిక్షణ అనిపిస్తుంది... వ్యవసాయం కన్నా ఎలక్త్రానిక్స్ వ్యాపారమే లాభదాయకమని ఆలోచించే కాలం ఇది   ప్రజా క్షేమం కంటే తమ పదవులే ముఖ్యమనుకునే నాయకులున్న దేశమిది.. ఎలాగో ఒకలాగా కాలం గడిపేసే పధ్ధతి నుండి మనం బయట పడనంత కాలం ఎన్ని సంవత్సరాలైనా మనం బానిసలమే.. మనకున్న స్వేచ్చ మనం ఇష్టమున్నట్లు బ్రతకడానికే ... కాని అడ్డదిడ్డంగా బ్రతకడానికి కాదు...  స్వేచ్చ తో పాటు క్రమశిక్షణ కావాలి ... రైమ్స్ తో పాటు వేమన పద్యాలు నేర్చుకోవాలి..  ఉపగ్రహ పరిజ్ఞానాన్ని నేల సారవంతానికి ఉపయోగించాలి...  రసాయన మందులతో పాటు, మన వేప, అశ్వగంధ ల ఉపయోగం గుర్తించాలి...   వేదాల్లో మెట్ట వేదాంతం మాత్రమె కాదు, విజ్ఞాన శాస్త్ర పరిజ్ఞానం కూడా ఉందని గ్రహించాలి.. వేరే వాళ్ళతో కలిసిపోతూ మనం మనం గా ఉంటే మన అస్తిస్త్వం నిలుపుకో గలుగు తాం.. ప్రపంచ దేశాల్లో ప్రత్యేకంగా నిలుస్తాం..
జైహింద్...